వికారాబాద్ జిల్లా – తాండూర్
కూలిన మైనారిటీ గురుకుల పాఠశాల ప్రహరీ గోడను పరిశీలించిన చైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి
విద్యార్థులతో కలిసి భోజనం చేసి సమస్యలు తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్
తాండూర్ పట్టణంలోని హైదరాబాద్ రహదారిపై ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాల వెనుక భాగంలోని ప్రహరీ గోడ కూలిపోవడంతో మున్సిపల్ యంత్రాంగం వెంటనే స్పందించింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి సోమవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి, కూలిన ప్రహరీ గోడను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రహరీ గోడను అత్యవసరంగా పునర్నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం హాస్టల్ పరిసరాలను పరిశీలించి, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు.
హాస్టల్ విద్యార్థులతో ముచ్చటించిన చైర్పర్సన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని హాస్టల్ యాజమాన్యాన్ని ఆదేశించారు.
కూలిపోయిన ప్రహరీ గోడ స్థానంలో వెంటనే కొత్త గోడ నిర్మాణ పనులు ప్రారంభించాలని సంబంధిత సిబ్బందికి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రజాక్ భాయ్, స్థానిక వార్డు కౌన్సిలర్ జావిద్ తదితరులు పాల్గొన్నారు.
