🔴 రంగారెడ్డి జిల్లా షాబాద్ లో దారుణం.
🔴 ఆరుగురిని హత్య చేసిన కిరాతకుడు.
నిజస్వరం ::
రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఫోక్సో కేసు పెట్టారన్న కోపంతో ఓ వ్యక్తి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఫోక్సో కేసు పెట్టిన బాలికను పొలంలోకి లాక్కెళ్లి.. అత్యాచారం చేసి చంపేశాడు. అనంతరం సొంత భార్యా పిల్లలను కూడా చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడకు చెందిన ఓ బాలిక.. రాజ్ కుమార్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ మే 16వ తేదీన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజ్ కుమార్ను అరెస్ట్ చేశారు. తనపై ఫోక్సో కేసు పెట్టిన కుటుంబంపై అతడు కక్ష పెంచుకున్నాడు. తాజాగా, అతడు బెయిల్పై ఇంటికి తిరిగొచ్చాడు. ఈ నేపథ్యంలోనే దారుణానికి ఒడిగట్టాడు. శనివారం తెల్లవారుజామున బాలిక ఇంటికి వెళ్లాడు. బాలిక కుటుంబంలోని ముగ్గురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. బాలికను హత్య చేసే ముందు పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం తన భార్య సరిత, మూడేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడిని కూడా హత్య చేశాడు.
హత్యల తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ‘నేను ఆరు మందిని మర్డర్ చేశాను. ఒకచోట ముగ్గురిని, మరొకచోట ముగ్గురిని హతమార్చాను. నేను కూడా చచ్చిపోతున్నా’ అని చెప్పాడు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. పోలీసులు ఆరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు భార్యాపిల్లలను ఎందుకు చంపాడన్నది మిస్టరీగా మిగిలింది.
చిట్యాల రుక్కమ్మ (65) చిట్యాల లక్ష్మీ (45) మైనర్ బాలిక (17) భార్య పార్వతి సరిత (30) పిల్లలు పరీక్షిత్ (3) దైవిక్షిత్ (2)..
