వికారాబాద్ జిల్లా…
వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
సాయి మేధ, ఆపిల్ కిడ్స్ స్కూల్లో కన్నుల పండువగా ఉట్టికొట్టే కార్యక్రమాలు
తాండూరు: నల్లని వాడు.. అల్లరివాడు.. గోపికాలోలుడు.. యశోద తనయుడు.. దేవకీ వసుదేవుల సుతుడు.. యోగీశ్వరుడిగా పేరొందిన శ్రీకృష్ణుని జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ విద్యాలయం, ఆపిల్ కిడ్స్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో ముస్తాబై ఆకట్టుకున్నారు. కోలాటాలు, నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. దశావతారాల వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉట్టికొట్టే కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులు ఉత్సాహంగా పోటీపడి పైకెగురుతూ పెరుగు ఉట్టిని పగులగొట్టారు. ఈ దృశ్యాలు విద్యార్థులు, తల్లిదండ్రులను అలరించాయి.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి పరిచయం చేసేందుకు పాఠశాలల్లో వివిధ పండుగలను నిర్వహిస్తున్నామని తెలిపారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను నేర్చుకుని, మన సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించినప్పటికీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మరవకూడదని అన్నారు.
కులమతాలకు అతీతంగా అన్ని పండుగలను పాఠశాలల్లో నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
